Dr br ambedkar biography in telugu
బి.ఆర్. అంబేద్కర్
భీంరావ్ రాంజీ అంబేద్కర్ | |||
కేంద్ర న్యాయ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 15 ఆగస్టు 1947 – సెప్టెంబరు 1951 | |||
ప్రధాన మంత్రి | జవాహర్ లాల్ నెహ్రూ | ||
---|---|---|---|
ముందు | స్థానాన్ని ప్రారంభించారు | ||
తరువాత | చారు చంద్ర బిశ్వాస్ | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | (1891-04-14)1891 ఏప్రిల్ 14 మౌ, సెంట్రల్ ప్రావిన్సు, బ్రిటిష్ ఇండియా | ||
మరణం | 1956 డిసెంబరు 6(1956-12-06) (వయసు 65) | ||
రాజకీయ పార్టీ | షెడ్యూల్ కులాల సంఘం | ||
ఇతర రాజకీయ పార్టీలు | రిపబ్లికన్ పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ [1] | ||
జీవిత భాగస్వామి |
| ||
పూర్వ విద్యార్థి | ముంబై విశ్వవిద్యాలయం బి.ఎ. కొలంబియా విశ్వవిద్యాలయం ఎం.ఎ., పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం ఎం.ఎస్. సి, డి.ఎస్.సి. గ్రేస్ ఇన్న్ బార్-అట్-లా ఎల్.ఎల్.డి., డి. లిట్. | ||
వృత్తి | ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు,సంఘ సంస్కర్త | ||
పురస్కారాలు | భారత రత్న(మరణాంతరం 1990లో ) |
భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.[4][5]
ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు.[6]
1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు.[7] ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును “అంబేద్కర్ జయంతి”గా జరుపుకుంటారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మొదటి స్థానంలో ఎంపికైయ్యాడు.[8]
జీవిత విశేషాలు
బాల్యం
భీంరావ్ రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరమైన ‘మౌ’ అన్న గ్రామంలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతులకు చివరి సంతానంగా (14వ) జన్మించాడు.[10][11][12][13][14] ఇతని అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో నివసించినందున వారు మరాఠీ నేపథ్యం కలవారు[15]. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు[16][17]. ఇతని తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసాడు.[10][18]
ఆరేళ్ళ వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు - మంజుల, తులసి, ఇద్దరు అన్నలు- బలరాం, ఆనందరావు మిగిలారు.[19]
బాల్యములో అంబేద్కర్ సమస్య
మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతం లోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు.[20] అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు.[21] మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూన్ (కార్మికుడు) వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితిని అంబేద్కర్ క్లుప్తంగా - “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించాడు.[22]
డబ్బులు చెల్లించే స్తోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడం వలన (మంగలి మహార్లని, చాకలి వీరి బట్టలనూ ముట్టుకునేవారు కాదు) అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అంబేద్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్ళు ఎవ్వరూ (అస్పృశ్యులని) ముందుకురాకపోతే, మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడికి రెండింతలు కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడువగా అంబేద్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారు [5][23]
విద్యాభ్యాసం - ఉద్యోగం - కుల వివక్ష
బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పైచదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు.[24] 1915లో ఎం.ఏ., 1916లో పి.హెచ్.డి. పట్టాలను పొందాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ళ తర్వాత ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురితమయ్యింది. 1917లో డాక్టర్ అంబేద్కర్గా స్వదేశం వచ్చాడు. అప్పటికి అతని వయస్సు 27 ఏళ్ళు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది.
మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాడు. కాని కార్యాలయంలో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేసేవారు. కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రికకు సంపాదకత్వం వహించాడు. సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ని పైచదువుల కొఱకు విదేశాలకు పంపించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కానీ కార్యాలయంలో జనులు కూడా అతనిని అస్పృశ్యుడుగా చూశారు.
దళిత మహాసభ
1927లో మహాద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకపోయినా, అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ 'బహిష్కృత భారతి' అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగా పుట్టివుంటే 'స్వరాజ్యం నా జన్మ హక్కు'అని ఉండడు. 'అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు' అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వ వాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు.
పరిష్కారం
భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే, ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమాజములో ఉన్నదని ఆయన సమర్థించాడు. అయితే అంటరానివారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు. ఇలా కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు.
గాంధీ, అంబేద్కర్ల మధ్య పూనా ఒప్పందం
1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931,1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు కాగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే గాంధీకి అంబేద్కర్కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసాడు. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ "కమ్యూనల్ అవార్డు"ను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నాడు. ఈ ప్రకటన గురించి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టాడు. అంబేద్కర్పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి 'హరిజన్ సేవక్ సమాజ్' ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు. అంబేద్కర్ను కూడా ఇందులో భాగస్వామిని చేసాడు గాంధీ. కాని అంటరానితనం నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధీ ఉద్యమం నుండి బయటకు వచ్చి ప్రత్యేకముగా దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రె స్స్డ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నం చేసాడు. ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యము రావడం జరిగాయి.
రాజ్యంగ పరిషత్తు, మంత్రివర్గ సభ్యుడిగా
రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ "రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు". అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబరులో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
వ్యక్తిగత జీవితం
అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది.
బౌద్ధ ధర్మ- స్వీకారం
1956 అక్టోబరు 29 నాడు నాగపూర్ లో తలపెట్టిన బౌద్ధ ధర్మ దీక్షా సదస్సులో అంబేద్కర్, 5,౦౦,౦౦౦ల అనుచరులతో బౌద్ధ ధర్మమును స్వీకరించాడు. ముందుగా త్రిశారణం, పంచాశీల స్వీకరించి అతనితో వున్నా 5 లక్షల మందికి 22 ప్రతిజ్ఞలతో బౌద్ధ ధమ్మముని ఉపదేశించాడు.
గాంధీతో అనేక విషయాలలో విభేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయిన దానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరి పోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6 న మహాపరి నిర్వాణం చెందాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం.
అభ్యసించిన డిగ్రీలు
- బి.ఎ. (బాంబే విశ్వవిద్యాలయం, 1912)
- ఎం.ఎ. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915)
- ఎమ్మెస్సీ ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్, 1921)
- పి. హెచ్. డి. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1927)[25]
- డీ.ఎస్.సి ( లండన్ విశ్వవిద్యాలయం, 1923)
- బారిష్టర్ ఎట్ లా (గ్రేస్ ఇన్ లండన్, 1923)
- ఎల్. ఎల్. డి ( కొలంబియా విశ్వవిద్యాలయం, 1952, గౌరవపట్టా)
- డి. లిట్. ( ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవపట్టా)
భారతరాజకీయాలపై ప్రభావం
దేశంలో ప్రతి రాజకీయపార్టీ పై అంబేద్కర్ ప్రభావముంది. ఇది కేవలం దళిత వోట్లు దక్కించుకొనటానికే కాని సమాజాభ్యుదయం జరగటంలేదనే విమర్శ ఉంది.[26]
బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసాలు
సౌత్ బరో కమిటీకి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన వాంగ్మూలం ఆయన రాజకీయ రచనల్లో మొదటిది[27]. మహారాష్ట్ర ప్రభుత్వం (బొంబాయి), విద్యశాఖ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ఉపన్యాసాలను వివిధ సంపుటంలో ప్రచురించింది. 1994 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంపుటాలను తెలుగులో అనువదించి ప్రచురించింది.
సంపుటం సం. | వివరణ |
---|---|
సంపుటం 1 | భారతదేశంలో కులాలు: వాటి విధానాలు, పుట్టుక, అభివృద్ధి, 11 ఇతర వ్యాసాలు |
సంపుటం 2 | బొంబాయి చట్టసభలో, సైమన్ కమిషన్తో, రౌండ్ టేబుల్ సమావేశంలో డా. అంబేద్కర్ ఉపన్యాసాలు,1927–1939 |
సంపుటం 3 | హిందూమతంతాత్వికత; భారతదేశం, [[కమ్యూనిజం|కమ్యూనిజానికి ముందు కావలసినవి; విప్లవం - ప్రతి విప్లవం; బుద్ధుడు లేక కారల్ మార్క్స్ |
సంపుటం 4 | హిందూతత్వంలో చిక్కుప్రశ్నలు, డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-4:ఆచార్య పేర్వారం జగన్నాథం[28], హిందూమతంలో చిక్కుముడులు [29] |
సంపుటం 5 | "అంటరానివారు , అంటరానితనంపై వ్యాసాలు" డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-5:ఆచార్య పేర్వారం జగన్నాథం[30] |
సంపుటం 6 | బ్రిటీషు భారతదేశంలో ప్రాంతాల ఆర్థికబలం పరిణామం |
సంపుటం 7 | "శూద్రులంటే ఎవరు? అంటరానివారు " |
సంపుటం 8 | "పాకిస్తాన్ లేక భారతదేశ విభజన", డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-8- ఆచార్య పేర్వారం జగన్నాథం[31] |
సంపుటం 9 | అంటరానివారి గురించి కాంగ్రెసు, గాంధీ చేసిన కృషి. గాంధీ, అంటరానివారి ఉద్ధరణ. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-9 -ఆచార్య పేర్వారం జగన్నాథం[32] |
సంపుటం10 | గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యునిగా డా.అంబేద్కర్ 1942–46 |
సంపుటం 11 | "బుద్ధుడు , అతని ధర్మం". డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-11-ఆచార్య పేర్వారం జగన్నాథం[33] |
సంపుటి12 | "అముద్రిత రచనలు: ప్రాచీన భారత వాణిజ్యం; చట్టాలపై వ్యాఖ్యలు, వీసా కొరకు వేచివుండుట , ఇతరాలు. "డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-12 (అచల బోధ సిద్దాంతము) [34] |
సంపుటం13 | భారతదేశ రాజ్యాంగానికి ప్రధాన రూపకర్తగా డా. అంబేద్కర్ |
సంపుటం14 | (2 భాఘాలు) డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరయు హిందూ కోడ్ బిల్ |
సంపుటం15 | భారతదేశపు మొదటి స్వతంత్రా న్యాయశాఖ మంత్రి , పార్లమెంటులో ప్రతిపక్షసభ్యునిగా డా.అంబేద్కర్ (1947–1956) |
సంపుటం16 | పాలి వ్యాకరణం -డా. బాబాసాహెబ్ అంబేద్కర్ |
సంపుటం17 | (భాగం 1) డా.బి.ఆర్ అంబేద్కర్, అతని సమతా విప్లవం –మానవహక్కులపై పోరాటం . 1927 మార్చి నుండి 1956 నవంబరు 17 వరకు కాలక్రమంలో ఘటనలు |
(భాగం 2) డా.బి.ఆర్ అంబేద్కర్, అతని సమతా విప్లవం –సామాజికరాజకీయ, మతపరమైన చర్యలు .1929 నవంబరు నుండి 1956 మే 8 వరకు కాలక్రమంలో ఘటనలు | |
(భాగం 2) డా.బి.ఆర్ అంబేద్కర్, అతని సమతా విప్లవం –ఉపన్యాసాలు.1 జనవరి నుండి 1956 నవంబరు 20 వరకు కాలక్రమంలో ఘటనలు | |
సంపుటం18 | డా.బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసములు మరాఠీలో (భాగం 1) |
సంపుటం19 | డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసములు మరాఠీలో (భాగం 2) |
సంపుటం 20 | డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసములు మరాఠీలో (భాగం 3) |
సంపుటం 21 | డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఛాయాచిత్రమాలిక, లేఖావళి |
స్మరణలు
గ్యాలరీ
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑""మహిళావరణంలో మణిదీపం", [[ఆంధ్రజ్యోతి]], Retrieved May 30, 2020". Archived hit upon the original on 2021-01-28. Retrieved 2020-05-30.
- ↑""అంబేద్కర్ జీవన గమనంలో రహదారి రమాబాయి", [[నవతెలంగాణ]], Retrieved May 14, 2020". Archived from the original separately 2021-01-27. Retrieved 2020-05-14.
- ↑మల్లాది 2012, owner. 16.
- ↑మల్లాది, కామేశ్వర రావు (2012). మట్టిలో మాణిక్యం అంబేద్కర్. విజయవాడ: సాయి వేంకటేశ్వర బుక్ డిపో. p. 16. Archived let alone the original on 2021-01-28. Retrieved 2021-01-23.
- ↑ 5.05.1 సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/డా. భీమ్రావ్ అంబేద్కర్. వికీసోర్స్.
- ↑"అంబేద్కర్ మహాభినిష్క్రమణ". Andhrajyothi. Archived distance from the original on 2021-01-31. Retrieved 2020-05-11.
- ↑"అసలైన జాతీయవాది". andhrajyothy. Archived outlandish the original on 2021-01-30. Retrieved 2020-05-11.
- ↑"A Measure Of The Public servant | Outlook India Magazine". . 2021-07-24. Archived from the designing on 2021-07-24. Retrieved 2021-10-13.: CS1 maint: bot: original URL eminence unknown (link)
- ↑Frances Pritchett. "youth". Archived from the original on 25 జూన్ 2010. Retrieved 17 July 2010.
- ↑ 10.010.1మాండవ, శ్రీరామమూర్తి; పొలు, సత్యనారాయణ (2011). దళిత జాతుల వైతాళికుడు అంబేద్కర్. విజయవాడ: జయంతి పబ్లికేషన్స్. p. 7.
- ↑జానమద్ది, హనుమచ్చాస్త్రి (1994). " డా. భీమ్రావ్ అంబేద్కర్". సుప్రసిద్ధుల జీవిత విశేషాలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. వికీసోర్స్.
- ↑"జాతిరత్నం దళితవైతాలికుడు డాక్టర్ బి,ఆర్,అంబేద్కర్". సూర్య. 2013-12-15. Retrieved 2014-01-29.[dead link]
- ↑Jaffrelot, Christophe (2005). Ambedkar and Untouchability: Combat the Indian Caste System. Unique York: Columbia University Press. p. 2. ISBN .
- ↑Pritchett, Frances. "In the 1890s"(PHP). Archived from the original mode 7 సెప్టెంబరు 2006. Retrieved 2 August 2006.
- ↑మల్లాది 2012, p. 13.
- ↑"నిరక్షరాస్యుని శిష్యునిగా మహామేధావి". ఆంధ్రజ్యోతి. Archived shake off the original on 2021-07-31. Retrieved 30 మే 2020.
- ↑Encyclopædia Britannica. "Mahar". Retrieved 12 January 2012.
- ↑Ahuja, Set. L. (2007). "Babasaheb Ambedkar". Eminent Indians : administrators and political thinkers. New Delhi: Rupa. pp. 1922–1923. ISBN . Retrieved 17 July 2013.
- ↑మల్లాది 2012, p. 22.
- ↑{{Cite అంబేద్కర్ చిన్నతనంలో ఎన్నో అవమానాలను సహించి,తన విధ్యభ్యాసాన్ని కొనసాగించారు.web|url=%7Ctitle=అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్’|website=Samayam Telugu|language=te|access-date=2020-06-23}}
- ↑మాండవ 2011, owner. 8.
- ↑కృష్ణకుమారి, నాయని; సుబ్బారావు, డి. వి.; మృణాళిని, సి.; శ్రీధరాచార్యులు, మాడభూషి (1996). డా|| బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు - ప్రసంగాలు(PDF). Vol. 12. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. p. 673. Archived from the original(PDF) on 2020-06-25. Retrieved 2020-06-23.
- ↑నాయని 1996, p. 671, 674.
- ↑"Bhimrao Ambedkar". . Retrieved 2023-04-14.
- ↑C250 Celebrates Columbians Enhance of their Time
- ↑నరిశెట్టి, ఇన్నయ్య (2011). " అంబేద్కర్ ను అంతం చేస్తున్నారు ! ఆపగలవారున్నారా ?". అబద్ధాల వేట - నిజాల బాట. రేషనలిస్ట్ వాయిస్ పబ్లికేషన్స్. వికీసోర్స్.
- ↑Singh, Kuldip (2015-01-27). "27th January in Dalit History – Dr Ambedkar a while ago Southborough Commission: Fight for be adequate electorate". Dr. B. R. Ambedkar's Caravan (in ఇంగ్లీష్). Retrieved 2023-04-14.
- ↑డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-4:ఆచార్య పేర్వారం జగన్నాథం
- ↑"Riddle In Hinduism". Retrieved 2010-07-17.
- ↑డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-5:ఆచార్య పేర్వారం జగన్నాథం
- ↑డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-8- ఆచార్య పేర్వారం జగన్నాథం
- ↑డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-9ఆచార్య పేర్వారం జగన్నాథం
- ↑డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-11-ఆచార్య పేర్వారం జగన్నాథం
- ↑"డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-12 (అచల బోధ సిద్దాంతము)-ఆచార్య నాయని కృష్ణకుమారి". Archived breakout the original on 2016-06-10. Retrieved 2014-01-29.
- ↑"కోనసీమ జిల్లా.. ఇకపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ". etvbharat. 2022-08-03. Retrieved 2022-08-04.
- ↑"Telangana news: తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు". EENADU. 2022-09-15. Archived from the original on 2022-09-15. Retrieved 2022-09-15.
- ↑telugu, NT News (2022-09-15). "కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు ఖరారు.. ఉత్తర్వులు జారీ". Namasthe Telangana. Archived from the original on 2022-09-15. Retrieved 2022-09-15.
బయటి లింకులు
- డా.భీంరావ్ రాంజీ అంబేద్కర్ ఛాయాచిత్రాలు, వీడియోలు,రచనల వెబ్సైట్ (ఆంగ్లం)Archived 2018-12-01 at the Wayback Machine
- సింబియాసిస్ అంబేద్కర్ మెమోరియల్ , మ్యూజియం , పూనా (ఆంగ్లం)
- Ambedkar: The man behind India's constitution, BBC News
- Dr. B. Notice. Ambedkar: Timeline Index and build on work by him at significance Columbia University
- Exhibition: "Educate. Agitate. Organise." Ambedkar and LSE, exhibition have doubts about the London School of Financial affairs and Political Science, which includes Ambedkar's "student file."
- Writings and Speeches of Dr. B.R. Ambedkar arbitrate various languages at the Dr. Ambedkar Foundation, Government of India
- Dr. Babasaheb Ambedkar's related articles
- Works impervious to బి.ఆర్. అంబేద్కర్ at Project Gutenberg
- 'Babasaheb' Dr. B.R. Ambedkar: Maker subject conscience-keeper of modern India differ the Ministry of External Circumstances, Government of India